బుద్ధుడిని దశావతారాలలో చేర్చిన మనువాదులు బౌద్ధ పౌర్ణమిని ఎందుకు చేయడం లేదు?.
ధర్మ చక్ర ప్రవర్తన అంటే ఏమిటి?.
Scv News Kasipet:--
భారతదేశ చరిత్రలో బుద్ధుడికి ప్రత్యేక స్థానం ఉంది. 2500 సంవత్సరాల క్రితం ఈ నేలన నడయాడిన చారిత్రక పురుషుడు సిద్ధార్థ గౌతమబుద్ధుడు. ఈ దేశంలో నీ మూలవాసులైన 85% బహుజన వర్గాల ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని *బహుజన హితాయ, బహుజన సుఖాయ,లోకాను కంపాయ* అంటూ 42 సంవత్సరాలు దేశంలోని అన్ని ప్రాంతాలను కాలినడకన పర్యటించి ధర్మ బోధన చేసిన మహనీయుడు. మనిషి ఉన్నతికి,పతనానికి మనసే ప్రధాన కారణమని ప్రపంచంలోనే మొట్టమొదట గుర్తించిన మానసిక శాస్త్రవేత్త గౌతమ బుద్ధుడు. మనుషులు ప్రేమ, దయ,కరుణ లను పాటిస్తూ పంచశీల,అష్టాంగ మార్గం, దశ పారామితులు పాటించి ఉన్నతంగా ఎదగాలని ప్రచారం చేసిన ధర్మ ప్రచారకుడు గౌతమ బుద్ధుడు.
బుద్ధుడి బోధనలను పాటించిన సమాజము, దేశాలు అంతర్జాతీయంగా ఎంతో అభివృద్ధి పథంలో పయనిస్తూన్నాయి. భారతదేశంలో పుట్టిన బౌద్ధమతం నేటికీ నామమాత్రంగానే మిగిలి పోయింది. భారత దేశంలో 2500 సంవత్సరాల క్రితమే వైదిక బ్రాహ్మణ యజ్ఞ యాగాలను నిరసిస్తూ బౌద్ధం మహా విప్లవాన్ని సృష్టించింది. ప్రపంచంలో పెను మార్పులు తెచ్చిన ఫ్రెంచి, రష్యా చైనా విప్లవాల కంటే బౌద్ధ విప్లవం మహోన్నతమైనది. దేశంలో సుమారు 150 సంవత్సరాలు వైదిక బ్రాహ్మణ మతాన్ని బౌద్ధం పాతాళంలోకి నెట్టివేసింది. తర్వాత ఆర్య బ్రాహ్మణ సేనాని పుష్యమిత్రు శుంగుడు చివరి మగధ బౌద్ధ రాజు బృహద్రదుడిని హత్యచేసి అధికారం లోకి వచ్చాడు. భారతదేశంలో పుట్టిన బౌద్ధం మతాన్ని, బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేసిన బౌద్ధ బిక్షులను ఊచకోత కోసి ఈ దేశం నుండి తరిమి వేశారు.
' భారత దేశం నుండి బౌద్ధాన్ని ఎప్పుడు తరిమివేశారో అప్పుడే దేశం ఆధ్యాత్మిక పరంగా తనకు తాను ఆత్మ హత్య చేస్తుందని ' మహాకవి గురజాడ అన్న మాటలు అక్షర సత్యాలు. ఈ దేశం నుండి బౌద్ధం అంతరించడంతో ప్రజల్లో అనైతిక భావాలు పెంపొంది దేశం అధోగతి పాలైంది. బౌద్ధాన్ని తరిమి కొట్టిన మనువాద వర్గం బౌద్ధ చరిత్ర ను కూడా వక్రీకరించారు. ఆత్మ, విగ్రహారాధన వ్యతిరేకించిన బుద్దున్ని ప్రాధాన్యతను తగ్గించే కుట్రలో భాగంగా దశావతారాల లో ఒక అవతారంగా మార్చుకున్నారు. బౌద్ధారమాలను, బుద్ధుడి విగ్రహాలను స్వాధీనం చేసుకుని హిందూ దేవాలయాలు గా, హిందూ పురాణ పురుషులైన బ్రహ్మ, విష్ణు,శివుడి విగ్రహాలుగా మార్చుకు న్నారు.దేశంలో ప్రతి ఏటా ఎలాంటి ఆధారాలు లేని పుక్కిటి పురాణాలలో ఉన్న రాముడుని కీర్తిస్తూ శ్రీరామనవవి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నా మనువాదులు,చారిత్రక పురుషుడైన అయినా సిద్ధార్థ గౌతమ బుద్ధుడి జన్మదిన మైన బుద్ధ జయంతిని ఎందుకు జరపడం లేదు బహుజన వర్గాలు ఆలోచించాలి....
వైశాఖ బౌద్ధ పౌర్ణమి సందర్భంగా
బుద్ధుడు ప్రబోధించిన 'ధర్మ చక్ర ప్రవర్తన 'గురించి అందిస్తున్న ప్రత్యేక కథనం...
బౌద్ధంలో వైశాఖ బౌద్ధ పౌర్ణమి ప్రత్యేక స్థానం ఉంది. బుద్ధ పౌర్ణమి రోజు బుద్ధుడి జననం, జ్ఞానోదయం,( ధర్మ చక్ర పరివర్తన ) నిర్వహణం (మరణం) జరిగాయి. అందుకే బౌద్ధులు వైశాఖ బౌద్ధ పౌర్ణమి ని పవిత్రంగా భావిస్తారు.
ప్రపంచంలో మనుషులు సుఖసంతోషాలు గా జీవించే మార్గాన్ని అన్వేషించేందుకు కపిలవస్తు రాజ్యానికి రాజు అయిన క్షత్రియ రాజకుమారుడు సిద్ధార్ధుడు తన రాజ్యాన్ని వదిలి సన్యాసిగా మారి దేశ యాత్రకు బయలుదేరాడు. ఎన్నో ధ్యాన పద్ధతులు తెలుసుకున్న తర్వాత బుద్ధుడు అయ్యాడు. బోధి అంటే పరిపూర్ణమైన బుద్ధి, నైతిక ప్రవర్తన మేలుకలయిక. గురువు లేకుండా తనకు తాను జ్ఞానం పొందిన పొందిన వ్యక్తిని బుద్ధుడు అంటారు. సిద్ధార్థుడు బుద్ధుడు గా మారి అహంకారం నిర్మూలనమే నిర్వహణమని తెలుసుకొని జ్ఞానోదయం పొందాడు. నిర్వహణానికి దారి చూపించేది నాలుగు మహోన్నత సత్యాలను బుద్ధుడు కనుగొన్నాడు. వాటిని ఆర్య సత్యాలు అంటారు.
1) ప్రపంచం దుఃఖమయం గా ఉన్నది అనేది సత్యం..
2) ఈ దుఃఖానికి కారణం ఉన్నది. రెండవ సత్యం.
3) దుఃఖ నివారణ మార్గం ఉన్నది అన్నది మూడవ సత్యం.
4) దుఃఖ నివారణకు అష్టాంగ మార్గము అనుసరించాలన్నదే నాలుగవ సత్యం.
ఈ సత్యాలను ప్రజలకు నేరుగా చెప్తే అర్థం చేసుకోరాని ముక్తి మార్గం కోసం అన్వేషిస్తున్న ఐదుగురు స్నేహితులకు కాశీలోని జింకల వనం లో ఈ నాలుగు ఆర్య సూత్రాలు వారికి బోధిస్తాడు. దీనిని 'ధర్మచక్ర ప్రవర్తనం ' అంటారు.
బుద్ధుడు ధర్మచక్ర ప్రవర్తన లో శిష్యులకు ఇలా బోధించాడు....
' దోషరహితమైన స్వచ్ఛమైన ప్రవర్తనకు నియమాలే ఈ ధర్మ చక్రానికి ఊచలు, అన్ని విషయాలు సమానంగా ఉండడమే
న్యాయం. వివేకమే చట్రం, వినయం, విచక్షణ జ్ఞానం,చక్రం మధ్య ఉండే గుబ్బ అందులో కదలకుండా స్థిరంగా ఉండే ఇరుసే సత్యం.'
" ప్రపంచంలో దుఃఖం ఉన్నది, దానికి కారణం ఉన్నది. దానిని పోగొట్టు కోవచ్చు.అందుకు అష్టాంగమార్గం వున్నది అనే నాలుగు ఉత్తమ సత్యాలను గ్రహించినవాడు సరైన దారిలో నడుస్తాడు. సరి అయిన అభిప్రాయాలు అతని దారికి వెలుగు చూపుతాయి. సక్రమమైన ఆశలు అతనికి మార్గం చూపుతాయి. మంచి మాట అతనికి నిలువ నీడనిస్తుంది. సత్ప్రవర్తన అతని నడకను సూటిగా ఉంచుతుంది. న్యాయ ఆర్జితం అతనికి ఆహారం. మంచి పనులు అతని అడుగులు, ఉన్నతమైన ఆలోచనలే అతని ఊపిరి . సధ్వి విచారమే అతని మనసును శాంతిస్తుంది. "
1) జీవితం దుఃఖమనే మొదటి ఆర్య సత్యం గురించి బుద్ధుడు ఇలా చెబుతాడు.
" ప్రాణి పుట్టుకే బాధతో ప్రారంభమవుతుంది. తర్వాత రోగాలు, ముసలితనం వచ్చి శరీరం క్షీణించడం, చివరకు మరణం, అన్ని బాధాకరమే. ఇష్టమైనవి దూరమైతే బాధ, ఇష్టం లేనిది సమర్పిస్తే బాధ, కోరికలు తీరకపోతే బాధ,అనురాగం వల్ల శరీరం పొందే అవస్థలు బాధ కలిగించేవే. ఇలా జీవితమంతా భాధల మయమే నేననేది గుర్తించడం తొలి సత్యం.
2) ఈ దుఃఖానికి కారణం ఏమిటి?
అంతులేని కోరికలు, వ్యామోహ ము, ఇంద్రియాలు, తృప్తి పరచే ప్రయత్నాలు, కామము, మోహము, ద్వేషము, అనురాగము,వియోగం వంటి ఉద్వేగాలు. సుఖ సంతోషాలు కోసం పడే ఆరాటం భవిష్యత్తు గురించి బెంగ ఇవన్నీ దుఃఖానికి దారితీస్తాయి. దుఃఖానికి కారణం కనుగొనడమే రెండవ సత్యం.
3) దుఃఖాన్ని నిర్మూలించవచ్చు, కోరికలు తుడిచివేసే అప్పుడు ఉద్వేగాలు సమసిపోతాయి. మనసుకు ఊరట కలుగుతుంది. బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఇది మూడవ సత్యం.
4) దుఃఖానికి అష్టంగా మార్గం అన్నది నాలుగవ సత్యం.
అష్టాంగ మార్గంలోని 8 మార్గాలు ఇవి .
సమ్యక్ దృష్టి, సంకల్పం, వాక్కు, కర్మ,,జీవనం, యత్నం, స్మృతి, సమాధి.
1.సమ్యక్ దృష్టి అంటే?
ప్రపంచంలో ఏది స్థిరంగా శాశ్వతంగా ఉండదని దృక్పదం.
2. సమ్యక్ సంకల్పం అంటే?
పరిశుద్ధమైన అభిలాషలు కలిగి హింస ప్రతి హింసల గురించి ఆలోచించకుండా ఉండటం.
3) సమ్యక్ వాక్ అంటే?
నోటికొచ్చినట్టు మాట్లాడకుండా సంయమనంతో పాటించి ప్రియమైన హితమైన మాటలు మాట్లాడడం.
4. సమ్యక్ కర్మ అంటే?
మంచి పనులు, పుణ్యకార్యాలు, పరిశుద్ధమైన కర్మలు,వీటిని కుశల కర్మలు చేయడం అంటారు.
5. సమ్యక్ జీవనం అంటే?
ధర్మబద్ధంగా నిష్కలంక జీవించడం.
6. సమ్యక్ యత్నం అంటే?
మనస్సు,శరీరం రెండూ తరచు కలుషితమై పోతూ ఉంటాయనే జాగరూకతతో మన ప్రయత్నాలను పరిశుద్ధంగా ఉండేటట్లు చూసుకోవడం.
7. సమ్యక్ స్మృతి అంటే?
పైన చెప్పిన 6 భావాలను ఎప్పుడూ గుర్తుగా ఉంచుకొని సంచరించడం.
8. సమ్యక్ సమాధి అంటే?
పరిశుద్ధ ధ్యానం ఏకాగ్రత దృష్టితో పరమ జ్ఞానాన్ని ధ్యానించడం. ఈ అష్టాంగమార్గం మనుషుల దుఃఖాన్ని నిర్మూలిస్తుంది అని బుద్ధుడు తన శిష్యులకు బోధించాడు.
నేటి సమాజంలో మనం అంతా కూడా బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గాలు జీవితంలో పాటిస్తే దుఖానికి దూరంగా ఉండి ఆనందంగా ఉండవచ్చు. బహుజన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన బాబా సాహెబ్ అంబేద్కర్ చివరి రోజుల్లో
దేశంలోని బహుజన వర్గాలంతా హిందూమతంలోని కుల వివక్ష నుండి బయటపడి కుల మత భేదాలు లేని బౌద్ధ ధర్మంలో చేరి తమ కుటుంబాలు ఆనందంగా గడపాలని పిలుపునిచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు.
ఈ దేశ మూలవాసులమైన బహుజన వర్గాలమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో బుద్ధుడు బోధించిన సత్యమార్గంలో పయనించాలని బుద్ధ జయంతి సందర్భంగా సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా కోరుతుంది.
