మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మే డే ను అంబేద్కర్ మేడేగా జరుపుకుందాం.!

 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం'మే డే 'ను  భారతదేశంలో ఎనిమిది గంటల పని దినం, కనీస వేతన చట్టం తెచ్చిన అంబేద్కర్ జ్ఞాపకార్థం అంబేద్కర్ 'మే డే 'గా  జరుపుకుందాం.!


Scv News Kasipet:--

బాబా సాహెబ్ అంబేద్కర్   నవభారత  నిర్మాతగా, భారతదేశ చరిత్రలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన ఒక అత్యంత ప్రభావశీలుడైన నాయకుడిగా ప్రపంచం గుర్తిస్తుంటే  భారత దేశంలో మాత్రం ఆయనను ఒక కుల,ఒక వర్గ నాయకుడిగా నేటికీ  చూస్తున్నారు. అంబేద్కర్ 'అందరి నాయకుడు ' అంటూనే ఆయన గొప్పదనం తెలియజేయకుండా కేవలం ఆయనను రాజ్యాంగ రచయితగా మాత్రమే పరిమితం చేశాయి మనువాద బ్రాహ్మణీయ భావజాలంలోని పాలకవర్గాలు. బాబాసాహెబ్ అంబేద్కర్  భారతీయ కార్మిక ఉద్యమ కారుడిగా దేశంలోని కార్మిక వర్గానికి ఎన్నో హక్కులను సాధించి పెట్టిన కార్మిక బంధువు అన్న సంగతి నేటి బహుజన శ్రామిక వర్గాలకు చాలామందికి తెలవదు. 

దేశంలోని 85 శాతం ఉన్న బహుజనులకు అంబేద్కర్ ఓటు హక్కు, రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చాడని అందరికీ తెలుసు.కానీ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలోని శ్రామిక వర్గాలైన కార్మికులకు, రైతులకు, మహిళలకు బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం రాకముందే ఎన్నో హక్కులు సాధించి పెట్టిన మహనీయుడు  బాబాసాహెబ్ అంబేద్కర్.ఈ విషయాన్ని అగ్రకుల అహంకారం తో ఉన్న కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీల నాయకత్వం  ఉద్దేశ  పూర్వకం గానే విస్మరించాయి. భారతదేశ చరిత్రలో  బాబా సాహెబ్ సాగించిన పోరాటాలు, ఉద్యమాలు బహుజన వర్గాలకు సాధించి పెట్టిన హక్కుల గురించి చరిత్ర పుస్తకాల లో,పాఠ్యపుస్తకాలలో లిఖించ బడలేదు. బ్రాహ్మణీయ మనువాద వర్గం చదువు తమ చేతుల్లో ఉందని చరిత్రను వక్రీకరించి తమకు అనుకూలంగా రాసుకున్నాయి.

భారతదేశంలో కార్మిక వర్గానికి ఎనిమిది గంటల పని దినాలు,కరువు భత్యం,కనీస వేతనం,జీవిత బీమా, భవిష్యత్ నిధి, మహిళలకు సమాన వేతనం, ప్రసూతి సెలవు లాంటి ఎన్నో హక్కులను  కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. స్వాతంత్ర అనంతరం గత 75 ఏళ్లుగా అవే హక్కులు కొనసాగు తున్నాయి.ఈ విషయాన్ని భారత దేశ ప్రజలకు తెలవకుండా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకులు'మేడే సందర్భంగా అంబేద్కర్ పేరు గాని ఫోటో కాని పెట్టకుండా కార్మిక దినోత్సవ కార్యక్రమాలు జరుపుకోవడం దురదృష్టకరం. 

శ్రామిక వర్గాల కోసం అంబేద్కర్ చేసిన చేసిన చట్టాల వల్లే ఈ దేశంలోని బహుజన వర్గాలు ఆనందంగా జీవిస్తున్నాయి. ఆ మహనీయుడు  తెచ్చిన చట్టాలు వాటి ఫలితాలు పొందుతున్న శ్రామిక వర్గాలకు అంబేద్కర్ తెచ్చిన హక్కులు చట్టాల గురించి నేటికీ తెలియడం లేదు.  దేశంలోని మెజారిటీ వర్గాలమైన బహుజనులు' మే డే 'సందర్భంగా బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన కృషిని  తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 'మేడే 'సందర్భంగా ఈ దేశంలోని కార్మిక వర్గానికి అంబేద్కర్ చేసిన సేవలు గురించి తెలుసుకుందాం!.. 

ప్రపంచవ్యాప్తంగా కార్మికులు 14 గంటల పనిదినం నుండి ఎనిమిది గంటల పని దినం కొరకు 19వ శతాబ్దంలో  విరోచిత పోరాటాలు చేశారు. అందులో భాగంగానే అమెరికాలోని చికాగో పట్టణంలో 1886 మే 4న లక్షలాది మంది కార్మికులు వీధుల్లోకి వచ్చి ఊరేగింపు నిర్వహించారు.ఆ ఊరేగింపులో  గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు వేయడంలో పోలీసులు కాల్పులు ప్రారంభిం చారు. కాల్పుల్లో చాలా మంది కార్మికులు  ప్రారంభించారు. రక్తపుమడుగులో  పడి ఉన్న కార్మికులు తమ చొక్కాలను  రక్తంలో ముంచి ఎగురవేయడంతో ఎర్రజెండా పుట్టుకొచ్చింది.అమరవీరుల పోరాట ఫలితంగా 1890 మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం గా జరుపుకోవాలని కమ్యూనిస్టు రెండవ ఇంటర్నేషనల్ ప్రకటించింది. అప్పటి నుండి  ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో ఎనిమిది గంటల పని దినాలు అమలులోకి వచ్చింది. బ్రిటిష్ వలస దేశంగా ఉన్న  భారతదేశంలో మాత్రం ఎనిమిది గంటల పని దినం అమలుకు నోచుకోలేదు.

స్వాతంత్రానికి ముందే అంబేద్కర్ ఎనిమిది గంటల పని దినాలు, కనీస వేతనం హక్కులు సాధించి పెట్టాడు. 

 భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వ హాయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ లేబర్ మెంబర్ గా బ్రిటిష్ వైస్రాయ్ కమిటీ ప్రభుత్వ హాయంలో కార్మిక శాఖ మంత్రిగా 7 జులై 1942 నుండి 1946 వరకు పనిచేశారు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్న  హయాంలోనే భారతదేశంలో కార్మికులకు, ఉద్యోగులకు, మహిళలకు ఎన్నో హక్కులను కల్పించారు. అవే  హక్కులు భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన డెబ్భైఐదు సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి.స్వాతంత్రానికి ముందు  బ్రిటిష్ వలస పాలనలో ఉన్న భారతదేశం లో మాత్రం ఎనిమిది గంటల పని దినములు అమలుకు నోచుకోలేదు.పరిశ్రమ ల్లో పనిచేసే కార్మికులు 14 గంటలు పని చేసేవారు. ఉదయం ఏడు గంటలకు వెళ్లి  రాత్రి 9 గంటల వరకు ఇంటికి వచ్చేవారు. పగటిపూట తండ్రి తమ పిల్లలను చూసేవాడు కాదు. పరిశ్రమల్లో పనిచేసే బహుజన శ్రామిక వర్గాలకు కనీస వేతనం కూడా చెల్లించేవారు కాదు.  కార్మికులు కనీస వేతనాలు, పెన్షన్, జీవిత బీమా, ప్రావిడెంట్ ఫండ్ లాంటి సుమారు 20 హక్కులను కార్మిక శాఖ మంత్రిగా చట్టబద్ధంగా  కల్పించిన మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. దేశంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ మైన' మేడే 'దినోత్సవం నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మాత్రం వినపడదు. నేటికీ బహుజన కార్మికులకు కూడా తెలవకుండా అగ్రవర్ణాల నాయకత్వం లోని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకులు చరిత్రను వక్రీకరించి అంబేద్కర్ ను అంటరాని వాడంటూ పేరు వినకుండా చేశారని విమర్శలు సార్వత్రా వ్యక్తమవుతున్నాయి .

 భారతదేశ కార్మికవర్గం కోసం బ్రిటిష్ వారి మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా  అంబేద్కర్ కల్పించిన హక్కుల గురించి తెలుసుకుందాం..! 

1) భారతదేశంలోని పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు 14 గంటల నుండి ఎనిమిది గంటల పని దినాలను 27 నవంబర్ 1942లో న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ లో 7వ సెషన్ లో ఈ ఆమోదం పొందేలా అంబేద్కర్ కృషి చేశాడు.

2) మహిళ  కార్మికుల కోసం చట్టాలు తెచ్చాడు. బొగ్గు బావులలో పనిచేసే మహిళల పై నిషేధం ఎత్తివేత, మహిళల కార్మికుల ఆరోగ్యాన్ని కల్పించే విధంగా  కాలకృత్యాలు తీర్చుకునేందుకు, చిన్న పిల్లల పోషణ ఏ విధంగా పలు హక్కులను సాధించిన పెట్టాడు. ప్రసూతి సెలవులను ఇప్పించారు.

3) భారత పరిశ్రమల చట్టం అంబేద్కర్ హయాంలోనే ఏర్పడింది.

4) ప్రస్తుతం నిరుద్యోగులు ప్రభుత్వ  పరిశ్రమలలో ఉద్యోగాల కోసం నమోదు చేసుకుంటున్న ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చట్టం ఏర్పాటు.

5) ఈఎస్ఐ ఆస్పత్రి చట్టం కింద కార్మికులు  పెద్దాస్పత్రిలో వైద్య చికిత్సలు పొందడం బీమా సదుపాయం కల్పించింది ఆ మహనీయుడే. చట్టం కింద నేటికీ లక్షలాది మంది కార్మికులు లబ్ధి పొందుతున్నారు.

6) కర్మాగారాలలో పనిచేసే ఉద్యోగులకు కరువు భత్యం  DA చట్టం తెచ్చాడు. ఈ చట్టం వల్ల పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి  పాయింట్ల ప్రాతిపాదికన వేతనాలు పెంచడం జరుగుతుంది.

7) లీవుల సదుపాయం. సిక్కు,సి ఎల్, వేతనంతో  కూడిన సెలవులు )

8) పే రివిజన్ ఏర్పాటు.  ప్రతి 4,5 ఏళ్లకు వేతనాలు పెంచుకోవడం.

8) భారతదేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే బొగ్గు  అత్యవసరమని అంబేద్కర్ గుర్తించి కార్మికుల కోసం కోల్ మైన్  ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎఫ్ సౌకర్యం 1944 జనవరి 31న కల్పించారు. గృహవసతి,నీరు, వైద్యం 1946 ఏప్రిల్ 8న బిల్లు తీసుకు వచ్చి అమలు చేయించడంలో క్రియాశీల పాత్ర పోషించారు.

9) కార్మిక చట్టాలు, సంఘాలు ఏర్పాటు లో అంబేద్కర్ కృషి ఉంది . దేశంలో 1920లో ఇండియన్ లేబర్ యాక్ట్ ఉండేది. కార్మిక సంఘాలకు మాత్రం 1943లో బిల్లు పెట్టి కార్మిక సంఘాల ఏర్పాటు వాటి గుర్తింపు ఇచ్చాడు.

10)  కార్మికుల ఆరోగ్యం విషయమై చట్టం తెచ్చాడు.

11) కార్మికులకు ఈపీఎఫ్ తన కింద యాజమాన్యం కార్మికుల మూల వేతనంలో 12 శాతం జమ చేస్తే కార్మికులు  12 శాతం జమచేసి ఇవ్వడం,  పెన్షను,రుణ సదుపాయాలు తీసుకోవడం లాంటి  చట్టం  తెచ్చాడు.

12) అసంఘటిత కార్మిక వర్గానికి  పెరుగుతున్న ధరలకు అనుగుణంగా భారతదేశంలోని ప్రైవేట్  పరిశ్రమలలో పనిచేసే కాంట్రాక్ట్  కార్మికులకు కనీస వేతన చట్టం తెచ్చాడు.

13) ఫ్యాక్టరీ ల ఏర్పాటు చట్టం.

14) ఫ్యాక్టరీ వివాదాల చట్టం

15) సమ్మే హక్కు చట్టం తెచ్చింది అంబేద్కర్ మహనీయుడే. సమ్మె హక్కును రాజకీయాలకు సంబంధం లేకుండా కార్మిక హక్కుల కోసం ఉపయోగించాలని 1936లో  ఇండియన్  లేబర్ పార్టీ ఏర్పాటు చేసి ముంబాయిలో కార్మికులతో తమ హక్కుల సాధన కోసం సమ్మె పిలుపునిచ్చాడు.

బహుజన శ్రామిక వర్గాల పెన్నిధి అంబేద్కర్ పట్ల అడుగడుగున వివక్షలే! 

 ప్రపంచంలో జ్ఞాన సంపన్నుడిగా అత్యధికంగా 32 డిగ్రీలు అందుకున్న  ప్రపంచ మేధావి అంబేద్కర్ పట్ల ఈ దేశం మనువాద బ్రాహ్మనీయ భావజాలం గల పాలకులు అతడి ప్రతిభ మేధస్సును గుర్తించకుండా  అడుగడుగున వివక్షలే చూపెట్టారు. అయినా మొక్కవోని ధైర్యంతో దేశంలోని అణగారిన వర్గాల కోసం రాజీలేని పోరాటాలు, ఉద్యమాలు నడిపాడు.కార్మిక హక్కులతో పాటు ఈ దేశ అభివృద్ధిలో కీలకంగా ఉన్న జల వనరుల సద్వినియోగం ప్రాజెక్టుల నిర్మాణం కోసం కూడా కేంద్ర నీటి చట్టం లాంటి ప్రత్యేక చట్టాలు తెచ్చాడు. అంబేద్కర్ మదిలో నుండి వచ్చిన ఆలోచన వల్లనే  పవర్ గిడ్, హిరాకుడ్, బాక్రానంగల్, మహానది  లాంటి బహుళార్ధక నీటిపారుదల ప్రాజెక్టులు ఏర్పాటు చేయ బడ్డాయి. వాటి నిర్మాణం తో దేశం ఎంతో అభివృద్ధి పథంలోకి పయనిస్తుంది. ఈ దేశంలోని మనువాదులు  దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల పూర్తి  నిర్లక్ష్యం వహించారు.

అంబేద్కర్ ఈ దేశ అభివృద్ధి కోసం, బహుజన వర్గాల అందరికీ ఉపాధి కల్పన కోసం  భూమి, పరిశ్రమలు, సహజ సంపదను జాతీయం చేసి ప్రజలందరికీ పంచాలని సూచించిన పాలక వర్గాలు పట్టించుకో లేదు. ఫలితంగా ఈరోజు దేశం ఇంకా పేదరికంలోనే ఉంది.తన మేదస్సుతో బహుళార్థక ప్రాజెక్టు లు, పవర్ గ్రిడ్, రిజర్వ్ బ్యాంక్ లాంటి ఏర్పాటుకు కృషి చేసిన అతని పేరు శీలాఫలకాలపై కాని, రిజర్వ్ బ్యాంక్ నుండి విడుదల అయ్యే కరెన్సీ పై అతని బొమ్మ చిత్రీకరించబడడంలేదు. మహిళల హక్కుల కోసం హిందూ కోడ్ బిల్లు, దేశంలోని యాభై నాలుగు శాతం ఉన్న మెజార్టీ వర్గమైన బీసీలకు బిసి రిజర్వేషన్లు అమలు చేయాలని పట్టుబట్టిన ప్రజాపక్షపాతి అంబేద్కర్. తాను పెట్టిన బిల్లులను కాంగ్రెస్ పాలకవర్గం  పట్టించుకోకపోవడం తో న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. భారతదేశ అభివృద్ధికీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని లిఖించిన మహా మేధావి అంబేద్కర్. ఆ మహా మేధావికి భారతరత్న ఇవ్వడంలో కూడా వివక్ష చూపి స్వాతంత్రం వచ్చిన 43 ఏళ్లకు,  అమరుడైన  34 ఏళ్లకు 1990లో భారతరత్న అవార్డు ఇవ్వడం  మనువాద బ్రాహ్మణ పాలక వర్గాల వివక్షను తేట తెల్లం చేస్తుంది. 

 కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తున్న మనువాద బ్రాహ్మణ పాలకవర్గాలు   . 

 డాక్టర్ అంబేద్కర్ దేశంలోని మెజారిటీ శ్రామిక వర్గాలకు మేలు చేసేందుకు దూర దృష్టితో చేసిన చట్టాలకు తూట్లు పొడుస్తూ నేడు కార్మిక చట్టాలను మార్చేందుకు మనువాద బ్రాహ్మణ పాలకవర్గాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. పెట్టుబడిదారి వర్గాలకు అనుకూలించే విధంగా కార్మికులకు నష్టం కలిగే రీతిలో కొన్ని చట్టాలను కూడా ఇటీవల మార్చారు. ప్రభుత్వ రంగంలో లాభాలలో నడిచే పరిశ్రమలను కూడా ప్రైవేట్ పెట్టుబడుదారులకు అప్పచెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనువాద బ్రాహ్మణియ పాలకులకు వ్యతిరేకంగా బహుజన శ్రామిక వర్గాలన్నీ ఏకమై ప్రతిఘటించా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశంలోని బహుజన శ్రామిక వర్గాలకు  అంబేద్కర్ సాధించి పెట్టిన హక్కులను గుర్తు చేసుకుంటూ'మే డే 'ను అంబేద్కర్ 'మేడే 'గా జరుపుకుందాం....