రీ సర్వే కోసం దుబ్బగూడం
వాసుల ఎదురుచూపులు .
- బోగస్ ఇండ్ల నిర్మాణంలో
వెలుగు చూసిన రాజకీయ
దళారి అవినీతి బాగోతం...!
| రాజకీయ దళారి చేతిలో మోసపోయిన ధరావత్ ధర్మ కుటుంబ సభ్యులు. |
![]() |
| పరిహారం చెల్లింపులు అవక తవకలపై విచారణ జరిపి రీ సర్వే చేయాలని కోరుతున్న దుబ్బగూడం వాసులు. |
మందమర్రి ఏరియా కళ్యాణి ఖని ఓపెన్ కాస్ట్ ముంపు గ్రామమైన కాసిపేట మండలం దుబ్బగూడం ప్రజలు ఇండ్ల నిర్మాణం చెల్లింపులో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తు గత కొద్ది రోజులుగా ఆందోళనకు దిగారు. గ్రామంలో దశాబ్దాలుగా నివసిస్తున్న వారికి తక్కువ పరిహారం,గ్రామంలో నివసించ కుండా పునాదులు లేకుండా నిర్మించిన బోగస్ ఇండ్లకు ఎక్కువ పరిహారం చెల్లించి తమకు అన్యాయం చేశారని దుబ్బగూడం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పరిహారం చెల్లింపులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి మళ్లీ 'రీ' సర్వే చేసి న్యాయం చేయాలని బాధితులు బెల్లంపల్లి ఆర్డీవో కు,జిల్లా కలెక్టర్,ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వినతి పత్రాలు ఇచ్చారు. వినతి పత్రాలు అందజేసి వారం రోజులు గడుస్తున్న రెవెన్యూ అధికారుల్లో కదలిక రావడంలేదని దుబ్బగూడెం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వీరి ఆందోళన ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో నే బోగస్ ఇండ్ల నిర్మాణం చేసి పరిహారం స్వాహా చేసేందుకు ప్రయత్నించిన ఒక రాజకీయ దళారి అవినీతి బాగోతం వెలుగు చూడడం మండలంలో చర్చ నియంశంగా మారింది.
రాజకీయ దళారి అవినీతి బాగోతం ఇది....!
దుబ్బగూడం గ్రామంలో గతంలో కొన్ని సంవత్సరాల క్రితం నివసించి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి పేరిట రాజకీయ దళారీ ఇండ్లను నిర్మించి పంచాయతీ రెవెన్యూశాఖ అండదండ లతో వాటికి ఇంటి నెంబర్లు వేయించు కొని పరిహారం స్వాహా చేసేందుకు ప్రణాళిక వేసుకున్నాడు.అందులో భాగంగానే దుబ్బగూడెం గ్రామంలో 18 ఇళ్ల వరకు పునాదులు లేకుండానే నేలపై గోడలు నిర్మించి,వాటికి తలుపులు, కిటికీలు పెట్టి పరిహారం స్వాహాకు ప్రయత్నాలు చేశాడు.
రెవెన్యూ శాఖ తీరు పట్ల గ్రామస్తుల ఆగ్రహం.
బోగస్ ఇండ్లపై గ్రామస్తులు ప్రజా సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేసి రెవెన్యూ అధికారుల ఫిర్యాదు చేసిన ఫలితం లేదు. ప్రజా ధనాన్ని వేతనాలు గా తీసుకుని ప్రజల కోసం, ప్రభుత్వ నిధులను కాపాడేందుకు పని చేయాల్సిన రెవెన్యూశాఖ అధికారులు, సిబ్బంది 'కంచే చేను మేచిన చందంగా' అవినీతిపరులకు అండగా నిలవడం సిగ్గుచేటుగా ఉందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖలోని కొంతమంది అధికారులు రాజకీయ దళారి ఇచ్చే మామూళ్లకు, ప్రలోభాలకు లొంగి మనుషులు నివసించని ఇండ్లకు పరిహారం మంజూరు అయినట్టు ముందస్తు నోటీసులు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బోగస్ ఇండ్ల పరిహారం కంటే స్థానికంగా నివసిస్తున్న వారికి తక్కువగా చెల్లించడంపై గ్రామస్తులు రెవెన్యూ శాఖపై ఆగ్రహం చేస్తున్నారు. వీటికి పరిహారం కింద 6 నుండి 8 లక్షల నిధులు వస్తాయని రెవెన్యూ శాఖ ముందస్తు నోటీసులో తెలియ జేసింది.
రాజకీయ దళారి నిర్మించిన 18 ఇండ్లకు ఒక్కడికే కోటి రూపాయల వరకు పరిహారం వస్తుంద ని గ్రామస్తులు తెలిపారు.ఇండ్ల నిర్మాణం ముందు గ్రామంలో ఉండి వెళ్లిపోయిన వారితో 2015 లోనే బాండ్ పేపర్ తో పరిహారంలో 30% బాధితులకు 70 శాతం తాను తీసుకుంటానని రాయించు కున్నాడు. పరిహారం మంజూరైన తర్వాత 'ఇప్పుడు మీకు ఎలాంటి పరిహారం ఇచ్చేది లేదని తాను వేరే స్థలంలో ఇల్లు కట్టి పరిహారం పొందుతున్నానని, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని' బెదిరింపు లకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమకు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగు తున్నారు.
ధరావత్ ధర్మ కుటుంబ సభ్యుల ఆవేదన ఇది....
![]() |
| ధరావత్ ధర్మ కుటుంబ సభ్యులకు రాజకీయ దళారి రాసిచ్చిన బాండ్ పత్రం చూపిస్తున్న బాధితులు. |
![]() |
ధరావత్ ధర్మ భార్య కిష్టమ్మ ఓటర్ ఐడి కార్డులో ఉన్న ఇంటి నెంబర్ పై రాజకీయ దళారి ఇండ్లు నిర్మించి పరిహారం స్వహ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని బంధువుల ఆరోపణ.
బోగస్ ఇండ్లకు పరిహారం చెల్లింపు పై రెవెన్యూ, సింగరేణి అధికారులు స్పందించాలని గ్రామస్తుల డిమాండ్.
రాజకీయ దళారులు ప్రభుత్వ ధనమైన పరిహారం స్వాహా చేసేందుకు రెవెన్యూ, పంచాయతీ అధికారుల అండదండల తో బోగస్ ఇండ్ల నిర్మాణం చేసి బరి తెగించి వ్యవహరిస్తుండడం పట్ల దుబ్బగూడం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుబ్బ గూడెం గ్రామంలో సుమారు 50 బోగస్ ఇండ్లను పరిహారం స్వాహా చేసేందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు నిర్మించారని దీనిపై విచారణ జరపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బోగస్ ఇండ్ల పరిహారం చెల్లింపు విషయంలో సింగరేణి యాజమాన్యం కూడా జోక్యం చేసుకొని రెవెన్యూ శాఖ చే 'రీ 'సర్వే చేయిస్తే వాటికి చెల్లించే సుమారు రెండు కోట్ల పరిహారం కంపెనీకి మిగులు తుందని పరిహారాన్ని పునరావాస కాలనీ అభివృద్ధి పనులకు కేటాయించాలని దుబ్బగూడెం గ్రామస్తులు కోరుతున్నారు. బోగస్ ఇండ్ల నిర్మాణం పై విచారణ జరిపి ప్రభుత్వ నిధులైన ప్రజా ధనాన్ని స్వాహా చేసేందు కు ప్రయత్నిస్తున్న రాజకీయ దళారులపై చీటింగ్ కేసు నమోదు చేయాలని దుబ్బగూడం వాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.






