కాసిపేట మండల కేంద్రంలో భీమా కోరేగావ్ విజయ దివాస్
Scw News Kasipet:-కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద శనివారం మండల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణపీష్వాల సైన్యాన్ని మట్టిక రిపించిన మహార్ యుద్ధ వీరుల స్మారకం గా భీమా కోరేగావ్ విజయ దివాస్ కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ యువజన సంఘం నాయకులు,కార్యకర్తలు భీమా కోరేగావ్ యుద్ధంలో విరోచిత పోరాటం చేసి అమరులైన మహర్ సైనికులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. అణ గారిన కులాల ఐక్యత వర్ధిల్లాలి , బహుజన పోరాటయోధులకు జోహార్ లాల్ అంటూ నినాదాలు చేశారు. తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జాడి రామ్ చందర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా బహుజన సమాజం ఐక్యత కోసం బహుజన పోరాటయోధుల సంస్మరణ కార్యక్రమాలన్నీ ఇక నుండి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. బ్రాహ్మణ పీష్వా సైన్యం చేత అణచివేయబడ్డ మహర్లు భీమా కోరేగావ్ యుద్ధం లో బ్రాహ్మణ సైన్యాన్ని చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. వారి స్మారకార్థం బీమా కోరేగావ్ విజయ దివాస్ కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. అంబేద్కర్ యువజన సంఘం సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతు భారతదేశ బహుజన చరిత్రలో భీమా కోరేగావ్ యుద్ధం చారిత్రాత్మక మైనదని అన్నారు. దేశంలో మూడు వేల సంవత్సరాలుగా ఆర్య బ్రాహ్మణుల చేత అణచివేయబడ్డ అతిశూద్ర వర్గమైన మహర్ జాతి సైనికులు బ్రిటిష్ సైన్యంలో చేరి బ్రాహ్మణ సైన్యాలను ఓడించార న్నారు. భీమా కోరేగావ్ యుద్ధం లో 500 మంది మహర్ వీరులు 25000 పీష్వా సైన్యాల పై విజయం సాధించారన్నారు. విరోచిత పోరులో 22 మంది మహర్ వీరులు అమరులయ్యారన్నారు . భీమ కోరేగావ్ యుద్ధం తర్వాత భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం స్థిర పడిందన్నారు . యుద్ధ విజయానికి చిహ్నంగా బ్రిటిష్ ప్రభుత్వం కోరేగావ్ గ్రామంలో 65 అడుగుల అడుగుల ఎత్తు లో స్మారకస్థూపం నిర్మించి 1823 జనవరి 1 నుండి భీమా కోరేగావ్ అమరవీరుల విజయ్ దివాస్ ఉత్సవాలు ప్రారంభించిదన్నారు. 1927 నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ అమర వీరుల స్మారక స్థూపం సందర్శించి విజయ్ దివాస్ ను ప్రతియేటా భారతదేశంలోని బహుజనులు అంత జరుపుకోవాలని పిలుపునిచ్చా రన్నారు. అంబేద్కర్ యువజన సంఘం సాంస్కృతిక విభాగం ఇన్ఛార్జ్ గొడిసెల బాపు మాట్లా డుతూ అగ్రవర్ణాల చేత తరతరాలుగా అణిచివేయబడ్డ మహార్ వీరులు భీమా కోరేగావ్ యుద్ధం లో బ్రాహ్మణ పీష్వా సైన్యాలను ఓడించడం అంటరాని జాతుల విజయమని అన్నారు. ప్రతి ఏటా భీమా కోరేగావ్ అమరవీరుల విజయ్ దివాస్ మండలంలోని అన్ని గ్రామాలలో జరిపే విధంగా అంబేద్కర్ యువజన సంఘం ప్రచారం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం గౌరవాధ్యక్షులు జాడి పోశం, ఉపాధ్యక్షుడు అగ్గి సత్తయ్య, కోశాధికారి బోయిని బాపు, సంయుక్త కార్యదర్శి గొడిసెల సురేందర్, సోషల్ మీడియా ఇన్ఛార్జి సాయి కుమార్, సలహాదారులు లంక లక్ష్మణ్, శిలోజు మురళి, కార్యవర్గ సభ్యులు బుగ్గ రాజు, గొడిసెల విజయ్ కుమార్, అన్వేష్ కుమార్, సోదరి తిరుపతి,నిటూరి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.